Maharastra; సాధారణంగా పాలకులు నిర్ణయాలను వ్యతిరిస్తున్న సందర్బంలో వివిధ వర్గాలు, సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. అందులో కొన్ని నిరసనలు వినూత్నంగా ఉంటాయి. అదే కోవలో మహారాష్ట్రలో చత్రపతి శివాజీ వంశీయులైన ఓ బీజెపీ ఎంపి వినూత్న రీతిలో బీక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు.
విషయంలోకి వెళితే…గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర నుండే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ ఠాకరే ప్రభుత్వం వైరస్ నియంత్రణకు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నది. ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ విధింపే శరణ్యం అన్న ఆలోచనకు ప్రభుత్వం వస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ఉద్దవ్ ఠాకరే వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని ఇటీవల ఉద్దవ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో లాక్ డౌన్ విధించక తప్పేలాలేదని సీఎం ఉద్దవ్ పేర్కొన్నారు.
అయితే గత అనుభవాల రీత్యా లాక్ డౌన్ విధిస్తే ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుందనీ, వ్యాపారులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారనీ కావున లాక్ డౌన్ ప్రతిపాదన విరమించుకోవాలని పలు వర్గాల నుండి ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. చత్రపతి శివాజీ వంశీయుడైన బీజేపీ ఎంపి ఉదయన్ రాజే భోస్లే కూడా లాక్ డౌన్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు. వినూత్నంగా ఆయన రోడ్డుపై పళ్లెం పట్టుకుని బీక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భిక్షాటన ద్వారా వచ్చిన రూ.450లను జిల్లా అధికారులకు అందించి లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.