శబరిమల పుణ్యక్షేత్రం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం దీక్షా స్వాములు, భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుండి వెలుగులీనుతున్న జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. దీక్షా స్వాముల శరణుఘోషతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. కాంత మాల కొండపై జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిస్తారనీ, దేవతలు, రుషులు భగవంతుడికి హారతి ఇస్తారని భక్తుల నమ్మిక. మకర జ్యోతి దర్శనం కోసం శబరిలమ పంబ, పులిమేడు, నీలికల్ ప్రాంతాల్లో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
శబరిమలలో కరోనా నిబందనలను అధికారులు అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనల కారణఁగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిచ్చారు. పంబ నుండి సన్నిధానం వరకూ అయ్యప్ప దీక్షా స్వాములు వేచి ఉన్నారు. భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇరుముడులతో వచ్చిన అయ్యప దీక్షా స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి పర్వదినం నాడు శబరిమలలో జ్యోతి దర్శనం చేసుకుంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని కనబడినట్లు దీక్షా స్వాములు భావిస్తారు. అందుకే జ్యోతి దర్శనం కోసం ప్రతి ఎటా ఎక్కువ సంఖ్యలో దీక్షా స్వాములు మకర సంక్రాంతి నాటికి శబరిమల చేరుకుంటుంటారు
జ్యోతి దర్శనం కంటే ముందు పందళం నుండి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలవిరాట్టుకు హారతి ఇచ్చారు. ఆ వెంటనే క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలం మేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. దీక్షా స్వాములు, భక్తులు జ్యోతిదర్శనంతో భక్తిపారవశ్యంతో ముగినిపోయారు. శబరిమల జ్యోతి దర్శనాన్ని పలు ప్రసార మాధ్యమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దేశ వ్యాప్తంగా భక్తులు తిలకించి పరవశించిపోయారు.
ఇది కూడా చదవండి..సుప్రీం కమిటీ నుండి తప్పుకున్న భూపేందర్ సింగ్ మాన్