కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి శశిథరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 416 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మల్లిఖార్జున ఖర్గే విజయంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ఖర్గేకు ఎన్నికల్లో పరాజయం పాలైన శశిథరూర్ అభినందనలు తెలిపారు. శశిథరూర్ ఖర్గే నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన అభినందనలు తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు. ‘నిజమైన పార్టీ పునరుద్దరణ ప్రక్రియ ఈ రోజుతో మొదలైనట్టు నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ఖర్గేకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర నేతలు అభినందనలు తెలిపారు. 24 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత నెహ్రూ, – గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నికైయ్యారు. ఈ నెల 17వ తేదీన అధ్యక్ష ఎన్నికకు పోలింగ్ జరిగింది. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా అనంతరం ఆయా రాష్ట్రాల నుండి బ్యాలెట్ బాక్సులను న్యూడిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే పోలింగ్ అనంతరం ఉత్తరప్రదేశ్ లో జరిగిన పోలింగ్ లో అక్రమాలు జరిగాయని శశిథరూర్ వర్గం ఆరోపించింది. కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూధన్ మిస్త్రీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెల్లి లక్నో లో లేని డెలిగేట్ల ఓట్లు పోల్ అయ్యాయని, కావున యుపి నుండి పోల్ అయిన ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని కోరింది.
137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో అధ్యక్ష పదవికి పోటీ జరగడం ఇది ఆరవ సారి. 22 సంవత్సరాల క్రితం అధ్యక్ష పదవికి సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ లు పోటీ పడగా సోనియా గాంధీ ఎన్నికైయ్యారు. 1998 నుండి 2017 వరకూ, 2019 నుండి ఇప్పటి వరకూ సుమారు 20 ఏళ్లకు పైగా అధ్యక్షురాలుగా కొనిసాగిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. 2017 లో రాహుల్ గాంధీ అధ్యక్షుడుగా ఎన్నికైయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహించి ఆయన అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.