Mamata Banerjee: బీజేపీ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ బెంగాల్ లో మూడవ సారి అధికారంలోకి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇక హస్తినపై పోరుకు సన్నద్దం అవుతున్నారు. కేంద్రంలోని బీజేపీని అధికారం నుండి కూలదోసే వరకూ అన్ని రాష్ట్రాల్లో ఖేలా హాబ్ (ఆట ఆగదు) అని మమతా బెనర్జీ ప్రకటించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కోల్కతాలో నిర్వహించిన తమ పార్టీ మద్దతుదారుల ర్యాలీని ఉద్దేశించి వర్చ్యువల్ గా దీదీ ప్రసంగించారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీదీ ప్రసంగాన్ని ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, త్రిపుర, గుజరాత్, యూపి రాష్ట్రాల్లో కూడా వివిధ భాషల్లో ప్రసారం చేయడం విశేషం.
Read More: YSRCP: చంద్రబాబు సొంత జిల్లాలో వైసీపీలో రగిలిన రగడ..! సీఎం కి తలనొప్పి వ్యవహారం..!!
2024 లో జరిగే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆట ఆగదు (ఖేలా హాబ్) అన్న నినాదంతో దీదీ విపక్ష సమర శంఖం పూరించారు. ఆగస్టు 16న ఖేలా దివస్ (ఆటల దినోత్సవం) గా పాటిస్తామని చెప్పిన దీదీ ఆ రోజు పేద పిల్లలకు ఫుట్ బాల్స్, పంపిణీ చేస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారం నుండి బీజేపీని దింపే వరకూ అన్ని రాష్ట్రాల్లో ఈ ఖేల్ కొనసాగుతుందని అన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ని అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
దీదీ పెగాసస్ వివాదాన్ని ప్రస్తావిస్తూ ఇండియాను బీజేపీ ప్రజాస్వామ్య దేశంగా కాక నిఘా పెట్టే దేశంగా మార్చిందని ఆరోపించారు. ఈ నిఘా కారణంగా తన ఫోన్ తో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయనీ, ఈ కారణంగా తాను ఎన్సీపీ నేత శరద్ పవార్ తో గానీ, ఇతర విపక్ష నేతలతో మాట్లాడలేకపోయానని అన్నారు. 2024 ఎన్నికల్లో ఈ గూఢచర్యం పని చేయవదని పేర్కొన్నారు. పెగాసస్ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేయాలని దీదీ డిమాండ్ చేశారు. వర్చువల్ గా తమ ర్యాలీకి హజరైన కాంగ్రెస్, ఎన్సిపీ, శివసేన, ఇతర విపక్ష నేతలకు దీదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
1993 జూలై 21 కోల్కతాలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ జరుగుతుండగా జరిగిన పోలీసుల కాల్పుల్లో 13 మంది కార్యకర్తలు మృతి చెందారు. వారి స్మృత్యర్థం బెంగాల్ ల ప్రతి ఏటా జూలై 21న అమరవీరుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు.