Mamata Benerjee: మమతాబెనర్జీ … పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి. బీజేపీ హవాకు బ్రేకులు వేసి ధీరవనిత. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ పార్టీ భారీ విజయం సాధించింది. 221 స్థానాల్లో పార్టీ విజయం సాధించింది. తన సత్తాతో ప్రాంతీయ పార్టీల చూపు ఆమె ఆకర్షించింది. ఇదే సమయంలో దేశంలో ఎన్డీయేతర పార్టీలు కొత్త వాదనను తీసుకొచ్చాయి. దేశంలో బీజేపీ ని ఎదుర్కొనే సత్తా మమత ఒక్కరికే ఉందని, ఆమెకు యూపీఏ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సోనియా ను తప్పించి…మమతకు చాన్స్ ఇచ్చి….
ప్రస్తుతం యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ ఉన్నారు. సోనియా గాంధీ ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ఆ స్థానంలో రాహుల్ ను నియమించాలని చూస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఫెయిల్ అయ్యారు. 2019 ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం నుంచి రాహుల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు తిరిగి ఆయనకే పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో మమతకు యూపీఏ నాయకత్వ ప్రతిపాదనల అంశం తెరమీదకు వచ్చింది.
ఆ గెలుపు తర్వాతే గేమ్ ప్లాన్
తాజా ఫలితాల్లో మెజార్టీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకున్నప్పటికీ నందిగ్రాం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలలోగా మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మమత ముందుగా ఉప ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారిస్తారని అనంతరం యూపీఏ గురించి ఆలోచిస్తారని పలువురు పేర్కొంటున్నారు.