Manipur: మణిపూర్ లో హింస ప్రజ్వరిల్లడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో వైపు కేంద్ర బలగాలు ఎయిర్ ఫోర్స్ విమానంలో రాష్ట్ర రాజధాని ఇంపాల్ కు చేరుకున్నాయి. ఇంపాల్ లో ఆందోళనకారులు ఇప్పటికే అనేక వాహనాలను తగులబెట్టారు. ప్రార్థనా స్థలాలకు నిప్పుపెట్టారు. ముఖ్యంగా చురాచాంద్పూర్, ఇంపాల్ నగరాల్లో హింసాకాండ పెచ్చుమీరింది. మెజారిటీ గా ఉన్న మెయిటీలను షెడ్యూల్ తెగల కేటరిగిలో తేవాలనే డిమాండ్ ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ నాయకత్వం వహిస్తొంది. అయితే తమకు సంఘీభావం తెలుపుతున్న నిరసన కారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నరనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది.

బుధవారం నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్ పూర్ లోని అంగ్లో – కూకీ వార్ మెమోరియల్ గేటుకు నిప్పు పెట్టారని, దీంతో హింస ప్రజ్వరిల్లిందని తెలిపింది. ఈ సంఘం ప్రెసిడెంట్ పావోటింఠాంగ్ లుఫెంగ్ మాట్లాడుతూ ఇంపాల్, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్ధనా స్థలాలను తగులబెట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఈ హింసాకాండలో చాలా మంది గాయపడినట్లు, ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తొందన్నారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్తతలను సడలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు ప్రశాంతంగా ఉండాలని కోరారు.
మణిపూర్ సీఎం ఎన్ బిరేన్ సింగ్ స్పందిస్తూ .. సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్ధాలే దీనికి కారణమని చెప్పారు. ఇరువర్గాలతోనూ సంప్రదింపులు జరిపి, వారి సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. గత 24 గంటల్లో జరిగిన విధ్వంసకాండలో విలువైన ప్రాణాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇళ్లు, ఆస్తులకు నష్టం జరగడం దురదృష్టకరమని అన్నారు. తాజా పరిస్థితులపై సీఎం బిరేన్ సింగ్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు.
ప్రముఖ క్రీడాకారాణి మేరీ కోమ్ చేసిన ట్వీట్ లో నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహయపడండి అని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పీఎంఓ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింద్, వివిధ మీడియా సంస్థలకు ఈ ట్వీట్ ను ట్యాగ్ చేసారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మణిపూర్ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారన్నారు.
హింసాకాండ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫూ విధించింది. రానున్న అయిదు రోజుల పాటు రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమచారం, పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. శాంతి భద్రతలను కాపాడటం కోసం, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సైన్యం కవాతు నిర్వహించిందై. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్ సిబ్బంది పాల్గొంటున్నారు.
హస్తినలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్