కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పలు డిమాండ్ల పరిష్కారానికి ఆమరణ దీక్ష చేస్తుండగా, మరో పక్క 19వ ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు పుదుచ్ఛేరి ముఖ్యమంత్రి రంగస్వామి రానుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా యానాంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ యానాంలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న 15 సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రెండు నెలల క్రితం పుదుచ్ఛేరి అసెంబ్లీ ముందు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రంగ స్వామి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో గొల్లపల్లి దీక్ష విరమించారు. అయితే రెండు నెలలు దాటుతున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ముఖ్యమంత్రి రంగస్వామిపై యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హామీలను నెరవేర్చి యానాంకు వస్తే పూలతో స్వాగతం పలుకుతాం, లేకపోతే చెప్పుదెబ్బలతో స్వాగతం పలుకుతామని గొల్లపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో యానాంలోనే కాక పుదుచ్చేరి వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి.
ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు నిరసనగా ఎమ్మెల్యే గొల్లపల్లి యానాంలో ఆమరణ దీక్ష కు దిగారు. శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గొల్లపల్లి అభిమానులు నిన్న యానాం బంద్ కు పిలుపు నివ్వడంతో వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. గొల్లపల్లి ఆమరణ దీక్ష ఆదివారం మూడవ రోజుకు చేరుకుంది. యానాంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా నేడు జరుగు 19వ ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రంగ స్వామి హజరు కానున్నారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గీక్షకు ఏపికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతున్నారు. గొల్లపల్లికి ఏమైనా జరిగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పుదుచ్చేరి పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఓ పక్క స్థానిక ఎమ్మెల్యే ఆమరణ దీక్ష, మరో పక్క సీఎం పర్యటన నేపథ్యంలో ఏమి జరుగుతుందో అన్నటెన్షన్ యానాం ప్రజల్లో నెలకొంది.
Breaking: నల్లకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు ఖమ్మం జిల్లా వాసులు మృతి