Modi: దేశంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కు నిరసనకు దిగారు. ఏఐసీసీ పిలుపుతో జరిగిన ధర్నాలో పలువురు పార్టీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే, దీనికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సైతం ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read More: KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్?
కాంగ్రెస్ ఏమంటుందంటే..
దేశంలో నియంతృత్వ పాలన సాగుతోందని టీపీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ ఆరోపించారు. ప్రశ్నిస్తే 124ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ సాఫ్ట్వేర్ను ఎవరు కొనుగోలు చేశారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిఘా విభాగం కూడా తమ ఫోన్లను ట్యాప్ చేసిందని రాజనర్సింహ ఆరోపించారు. మల్లన్న సాగర్ ముట్టడికి యత్నించినప్పటినుంచి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫోన్ హ్యాకింగ్ మన దేశం చేస్తోందా? శత్రుదేశం చేస్తోందా? అని ప్రశ్నించారు. ఐటీ, ప్రైవసీ చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నాయని.. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Read More : KCR: హుజురాబాద్లో కేసీఆర్ స్కెచ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు
ప్రతిపక్షాల నోరు మూయించేందుకే…
ప్రతిపక్షాల నోరు మూసేందుకే వారిపై నిఘా పెట్టిందని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎలక్షన్ కమిషనర్ ఫోన్ ట్యాప్ కి గురికావడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ తోపాటు తన దగ్గర పని చేసేవారిపై కూడా నిఘా కేంద్రం పెట్టిందన్నారు. బ్రిటిష్ వారికంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ట్యాపింగ్ విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారించడంతోపాటు , సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడుతోందన్నారు. ప్రభుత్వం కూలిపోతుందనే భయం మోడీకి పట్టుకుందన్నారు. దైర్యం ఉన్నవాళ్ళెవరూ ఇలాంటి పనులు చేయలేరన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు.