Narendra Modi : 2019 లో నరేంద్ర మోడీకి ఉన్న ఇమేజ్ గ్రాఫ్ను తీసుకుంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజెపి ఇంతగా పోరాడాల్సిన అవసరం ఉండదు. అదే తరహాలో తమిళనాడులో సైతం అన్నాడిఎంకె ను చాలా సులభంగా గట్టెక్కించే గల సామర్థ్యం మోడీ ఇమేజ్ కు అప్పట్లో ఉండేది. బిజెపి అనే జాతీయ పార్టీ నుంచి ఒక వ్యక్తికి, ఆ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వచ్చిన ఇమేజ్ నరేంద్ర మోడీ దీ. గతంలో ఏ నేతకు, ముఖ్యంగా ప్రధానమంత్రి స్థాయి నేతకు ఇంత ఇమేజ్ వచ్చిన దాఖలాలు భారత దేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేవు. అయితే ప్రస్తుతం ఆ ఇమేజ్ గ్రాఫ్ కు మస్కా పడుతున్నట్లు కనిపించడమే బిజెపిలో కలవరానికి కారణం అవుతుంది.
నరేంద్ర మోడీ ప్రధాని అయిన మొదట్లో అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకు లభించిన సాదర స్వాగతం గతంలో ఏ భారతదేశ నేతకు లభించలేదు. అగ్రరాజ్యం సైతం ఆయనను ఎంతో హుందాగా ఆదరించింది. అమెరికాలో ఎక్కడ చూసినా మోదీ మోదీ అన్న నినాదాలు మిన్నంటాయి. అయితే అదంతా గతం. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ప్రవాసిలే కాకుండా, దేశీయులు కూడా మోదీ మీద ఎక్కడో అయిష్టత చూపుతున్న ట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రధాన మోడీ పాలన మీద మధ్యతరగతి ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారని బిజెపి అంతర్గత సర్వేలు సైతం హెచ్చరించాయి. ఇటీవల పార్టీ లోని కీలక విభాగం నిర్వహించిన సర్వేలో మోదీ గ్రాఫ్ బాగా పడిపోయిందని తేలడంతో బీజేపీ నేతలు ప్రత్యామ్నాయ చర్యలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
2022 లోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని దేశమంతటా ఒకే ఎన్నికల విధానం రావాలని బిజెపి ఆ మధ్య కాలంలో విస్తృతంగా ప్రచారం చేసింది. జాతీయ ఎన్నికల కమిషన్ సైతం దీనికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో మోదీ ప్రభుత్వం తర్వాత తీసుకోబోయే నిర్ణయం జమిలి ఎన్నికలు అనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఉన్నట్టుండి దీనిమీద అంతా సైలెంట్ అయిపోయింది. ఏ ఒక్క నేత జమిలి ఎన్నికలు ఊసే ఎత్తడం లేదు. కేంద్ర ప్రభుత్వం సైతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పచ్చజెండా ఊపడంతో 2022 లో ఇక జమిలి ఎన్నికలు అసంభవం అన్నది నిపుణుల మాట. దీనికి కారణం బీజేపీ పెద్దలు, ఆర్ ఎస్ ఎస్ పెద్దలు ఈ సమయంలో ఎన్నికలకు వెళ్లడం ద్వారా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఒక స్పష్టతకు రావడంతోనే జమిలి ఎన్నికలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడకు పలుమార్లు మోదీ అమిత్ షా లు ప్రచారానికి వెళ్లారు. అయినప్పటికీ బెంగాల్ ముఖ్యమంత్రి దీక్ష ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని సర్వేలు తేల్చడం బీజేపీని మరింత కలవరపాటుకు గురిచేస్తుంది. గతంలో మోదీ ఒక సభకు హాజరు అయితే చాలు ఈ రాష్ట్రంలో కచ్చితంగా విజయం సాధించే వాళ్ళం అనే దేవా బిజెపి కు ఆర్ఎస్ఎస్ పెద్దలకు ఉండేది. అయితే ప్రస్తుతం బెంగాల్లో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నా సానుకూల పవనాలు వీయడం లేదు.
బిజెపి ప్రభుత్వం మీద సగటు మధ్య తరగతి ప్రజలకు తీవ్రమైన అసహనం కనిపిస్తోంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో గ్యాస్ ధరలు వంటివి మధ్యతరగతి వారికి విసుగు పుట్టిస్తున్నాయి. మరోపక్క నిరుద్యోగ యువత నుంచి కేంద్ర ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వీటన్నింటితో పాటు బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, ఆత్మ నిర్భర్ భారత్ మాటలు సగటు చదువుకున్న యువకులను ఆలోచింపజేస్తున్నాయి. దీంతో మోడీ గ్రాఫ్ వేగంగా పడిపోతుంది.
బిజెపిలో ఒక సిద్ధాంతం ఉంది. 70 ఏళ్లు దాటిన నాయకులకు పదవులు ఇవ్వడానికి పార్టీ అంగీకరించదు. దీంతో పాటు రెండు సార్లు ఒకే పదవి నిర్వహించిన వ్యక్తిని వెంటనే మరో దానికి మార్చడం ఆ పార్టీ నైజం. అంటే 2024 లో బీజేపీ మరోసారి అద్భుతమైన సీట్లు గెలుచుకున్న ప్రధాని గా నరేంద్ర మోడీ పరిపాలించే అవకాశం లేదు. మరో కొత్త నేతలు బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్దలు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మోడీ గ్రాఫ్ బలంగా తగ్గడంతోపాటు బీజేపీకి ఎదురుగాలి వేస్తున్న సమయంలో ఎన్డీఏ మిత్ర పక్షాలను మళ్లీ ఏకం చేసేందుకు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను, ఏ కూటమిలోనూ ఇప్పటివరకు జట్టు కట్టని పార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు బిజెపి పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు అర్థం అవుతోంది.