Mulayam Singh Yadav: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వారం రోజుల క్రితం హరియానా గురగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఏటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్ 22న మూర్తిదేవి, సుఘర్ సింగ్ యాదవ్ దంపతులకు జన్మించిన ములాయం సింగ్ యాదవ్.. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి మహానాయకుల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన 16 నెలల పాటు జైలు జైలు జీవితం గడిపారు. 1992 లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా మార్చారు.
మూడు సార్లు సీఎంగా…
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు మూడు సార్లు సీఎంగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు నిర్వహించారు. ఒక సారి కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. మొత్తం పది సార్లు శాసనసభ సభ్యుడుగా, ఏడు సార్లు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. ముఖ్యమంత్రిగా యూపీని అభివృద్ధి పథంలో నడపారు. యూపిలో అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ములాయం సింగ్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్ యాదవ్ కాగా, రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం మెయిన్ పురి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. ములాయం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు సంతాపాన్ని ప్రకటించారు.