National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తొలి రోజు సోమవారం పది గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించిన ఈడీ అధికారులు, రెండవ రోజు మంగళవారం (నిన్న) ఏకంగా 11 గంటల పాటు విచారణ చేశారు. ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ, భోజనం విరామం తరువాత తిరిగి 4.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకూ విచారణను ఏకబిగిన కొనసాగించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
National Herald Case: ఆచిచూచి సమాధానాలు ఇస్తున్న రాహుల్ గాంధీ
ముందుగా యంగ్ ఇండియన్ కంపెనీలో రాహుల్ గాంధీ పెట్టుబడులు, ఆ కంపెనీతో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)తో లావాదేవీల డాక్యుమెంట్లను ఆయన ముందు ఉంచి చదవాలని కోరారు. ఆ వ్యాపారాల్లో ఆయన పాత్రపైనా పలు ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీని కనీసం 25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈడీ అధికారుల ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆచిచూచి సమాధానాలు చెప్పారనీ, ఏ ప్రశ్నను ఎలా తప్పించుకోవాలన్న దానిపై ముందుగా న్యాయవాదులు ఆయనకు బాగా శిక్షణ ఇచ్చినట్లు కనిపిస్తొందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. విచారణ జాప్యానికి కారణం మీరేనని ఈడీ అధికారులు చెప్పడంతో అందుకు రాహుల్ క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలుస్తొంది. విచారణలో కోల్కతా కు చెందిన డొటెక్స్ మర్కండైజ్ సంస్థకు ఉన్న సంబంధాలపైనా అధికారులు రాహుల్ ను ప్రశ్నించారు. కాగా విచారణ ఆలస్యమైనా ఫరవాలేదు మంగళవారమే విచారణ పూర్తి చేయాలని ఈడీ అధికారులకు రాహుల్ విజ్ఞప్తి చేయగా వారు అందుకు నిరాకరించారు. బుధవారం కూడా విచారణకు హజరుకావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ రోజు కూడా ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొనున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల నిరసనలు
మరో పక్క ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్ శ్రేణులు మూడవ రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఏఐసీసీ కార్యాలయం వద్ద మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా ఇదే కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీన ఈడీ విచారణకు హజరుకావాల్సి ఉంది. ఈ మేరకు సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం సోనియా గాంధీ కోవిడ్ అనంతర సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.