BJP : పార్టీ బలోపేతం కోసం రకరకాల దారుల్లో అందరినీ పార్టీలోకి తీసుకొచ్చిన బెంగాల్ బిజెపి ఇప్పుడు ఇంటి పోరు తో సతమతమవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ బీజేపీ లో లకలుకలు బయటకు వస్తున్నాయి. ఇది ప్రత్యర్థులకు ఎక్కడ బలం అవుతుందోనని భయపడుతున్నారు.
BJP 294 సీట్లకు 8 వేల మంది
ఇప్పటికే బెంగాల్ బీజేపీ లో ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఇది సీట్లు ఖరారు సమయానికి మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీల నుంచి బిజెపి లోకి వచ్చిన వారు సీటు కోసం కోటి ఆశలు పెట్టుకున్నారు. బెంగాల్ లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 వేల మంది ఆశావహులు ఉండటంతో, ఎవరికి టికెట్ ఇస్తే ఏమవుతుందోనన్న భయం కమలనాథులను వెంటాడుతోంది.
ముఖ్యంగా అవినీతి మరకలు ఉన్న నేతలను సైతం బీజేపీ లోకి తేవడంతో పార్టీ ఇమేజ్ మీద సైతం ఇది ప్రభావం చూపవచ్చని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో భాజపాలో ఉంటూ, నిత్యం తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో ఘర్షణ పడుతూ వచ్చిన సీనియర్లు ఇప్పుడు వారికే పని చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇది పాతవారికి ఇబ్బంది కలిగిస్తోందని బీజేపీ వర్గాలే బహాటంగా చెబుతున్నాయి.
చేరికలు నిలిపి వేసిన!
పార్టీలోకి వలసలు వస్తే కిందిస్థాయి లో పార్టీ బలోపేతం అవుతుందని భాజపా భావించింది. ఇది మొదట్లో మంచి ఫలితాలనే ఇచ్చిన తర్వాత మాత్రం అది కొత్త సమస్యకు దారి తీసేలా తయారు అయ్యింది. అందులోనూ బెంగాల్లో అవినీతి మీద పోరాటం చేయడానికి భాజపా కట్టుబడి ఉందన్న మాట వలస నేతల ప్రభావం తో క్రమంగా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.ఇది ప్రమాదకరంగా పరిణమిస్తుందని భావించిన కాషాయ పార్టీ ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు గేట్లు వేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అని భాజపా చెబుతున్నారు.
వారు వచ్చాకనే….
భాజపా ఇటీవల చేపట్టిన జోర్దార్ మేళాలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి 19 మంది సహా 28 మంది వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఒక తృణమూల్ ఎంపీ బిజెపి లో చేరారు. తృణమూల్ నుంచి వచ్చిన సువెందు అధికారి, రాజీవ్ బెనర్జీ, శోభన్ చటర్జీ, జితేంద్ర తివారి వంటి కీలక నేతలు బీజేపీ లోకి వచ్చాక తృణమూల్ మీద ఆధిపత్యం చలాయించవచ్చన్న బిజెపి ఆశలు వారి రాకతో తలకిందులయ్యాయి. వీరి రాకతో పార్టీలో అంతర్గత ఘర్షణలు మొదలయ్యాయి.
పార్టీలో పట్టు నిలుపుకోవడానికి సమప్రాధాన్యం కోసం వీరు పాకులాడుతూ ఇటీవల బిజెపి సీనియర్ నేత రాహుల్ సిన్హాను కాదని బీజేపీ కార్యదర్శి పదవిని టిఎం సీ నుంచి వచ్చిన అనుపమ్ భద్ర ను తీసుకోవడంతో బీజేపీ కు అనుకూలంగా ఉండే హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
జితేంద్ర తివారి రాకను బిజెపిలో ఎప్పటినుంచో ఉన్న కేంద్ర మంత్రి బాబు సుప్రీయోతో పాటు అగ్నిద్ర త్రిపాల్ వ్యతిరేకించిగా, పార్టీ వారికి షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఇలా కొత్త వారి రాకను వ్యతిరేకిస్తూ బిజెపిలో పాతవారు గళం పెంచడంతో వారికీ ప్రజల నుంచి ఎటు కార్యకర్తల నుంచి సానుభూతి వ్యక్తం అవుతోంది.
రెబల్స్ బెడద తప్పదా!
బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో బిజెపికి రెబల్స్ బెడద తప్పేటట్లు కనిపించడం లేదు. అయితే ఎనిమిది విడతల లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రతి విడతకు కాస్త సమయం బిజెపి కు దక్కుతుంది. ఆ సమయంలో ప్రతి విడతను యూనిట్గా తీసుకొని ఢిల్లీ నాయకుల సాయంతో అసంతృప్తులను బుజ్జగించ వచ్చు అన్నది బీజేపీ వ్యూహం. అయితే ఇప్పటికే బీజేపీ టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్న నేతలు పార్టీ మారి కూడా టికెట్ తెచ్చుకో కపోతే నియోజకవర్గంలో వారి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉంది.
దీంతో వారి మీద కార్యకర్తలు అనుచరుల ఒత్తిడి పెరిగి, రెబల్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పార్టీ సీనియర్లకు అన్యాయం జరిగితే వారు సైతం సానుభూతి పవనాల తో రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. అంటే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు రెబల్స్ బెడద బీజేపీని తలకిందులు చేస్తోంది. ఎట్టి పరిస్థితిలో బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఆరాట పడుతున్న వేళ వారు చేసుకున్నది వారికే అసనిపాతం అవుతోంది.