కరోనా వైరస్కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తోంది, సంతోషంగా న్యూ ఇయిర్ వేడుకలు జరుపుకోవచ్చని ప్రజలు అనుకుంటున్న తరుణంలో కరోనా స్ట్రెయిన్ కలకలాన్ని రేపుతున్నది. ఇండియాలోనూ బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్ట్రెయిన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఏకంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. బ్రిటన్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి, జనవరి ఒకటవ తేదీ రాత్రి 11 గంటల నుండి ఉదయం 6గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపింది. న్యూఇయర్ వేడుకలపై నిషేదం విధించినట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం…కర్ప్యూ సమయంలో బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఏపి, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించాయి. బహిరంగ ప్రదేశాలు, ఫంక్షన్ హాళ్లు, ఇతర ప్రదేశాలలో వేడుకలపై నిషేదం విధించాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే చర్యలు తప్పవని కూడా హెచ్చరించాయి.