Breaking: కేరళలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ లు రాజీనామాలు సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ మొహమ్మద్ ఆరీఫ్ ఖాన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు 11.30 గంటలకల్లా సదరు వీసీలు రాజీనామాలు సమర్పించాలని రాజ్ భవన్ నుండి నిన్న ఆదేశాలు వెలువడ్డాయి. తాను రాజీనామా చేయడం లేదని కన్నూరు వీసీ డాక్టర్ గోపీనాథ్ రవీంద్రన్ ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే గవర్నర్ మొహమ్మద్ అరిఫ్ ఖాన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 9 మంది వైస్ ఛాన్సలర్ లు ఈ రోజు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్ సాయంత్రం 4 గంటలకు పరిశీలన జరపనుంది కేరళ హైకోర్టు.
మరో పక్క కేరళ గవర్నర్ మొహమ్మద్ అరిఫ్ ఖాన్ జారీ చేసిన ఉత్తర్వులను సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి తప్పుబట్టారు. గవర్నర్ ఆదేశాలు చట్టవిరుద్దం, ఏపక్షమని పేర్కొన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. కేరళలోని ఉన్నత విద్యా వ్యవస్థను నియంత్రించి నాశనం చేయాలని చూస్తున్నారంటూ దుయ్యబట్టారు.
కేరళలోని ఏపిజే అబ్దుల్ కలాం టెక్నాలాజికల్ యూనివర్శిటీ వీ సీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆ నియామకాన్ని రద్దు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది వర్శిటీల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ మొహమ్మద్ అరిఫ్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడం కేరళ అధికార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.