Vaccination: ప్రస్తుతం దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి ?, మొదటి డోసుకు రెండవ డోసుకు మధ్య ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి ?, గర్బిణి మహిళలు తీసుకోవచ్చా ? ఇలా అనేక సందేహాలు ప్రజలకు ఉన్నాయి. స్థానికంగా వైద్యులు ఎవరికి తోచినట్లు వారు చెబుతూ ఉంటారు. అయితే టీకాలకు సంబంధించి కేంద్ర ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) చెప్పేదే కీలకం. ఇప్పుడు తాజాగా టీకాలపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం పలు కీలక సూచనలు చేసింది.
అవి ఏమిటంటే.. గర్బిణి మహిళలు ప్రసవం అయిన తరువాత ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని ఎన్టీఏజిఐ తెలిపింది. కరోనా పొజిటివ్ నిర్ధారణ అయి చికిత్స పొందిన వారు ఆరు నెలల తరువాత టీకా తీసుకోవాలని చెప్పింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి, రెండవ డోస్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండాలని తెలిపారు. 12-16 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు టీకా తీసుకోవాలంది. ప్రస్తుతం కోవిషీల్డ్ డోసుల గడువు ఆరు నుండి ఎనిమిది వారాలు ఉంటోందని, కోవాగ్జిన్ డోసుల మధ్య గడువు యథావిధిగా ఉండాలని ఎన్టీఎజీఐ సూచించింది.
ఎన్టీఏజీఐ సూచనల నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో ఒత్తిడి తగ్గుతుంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు ఆరు వారాలు కావడంతో వ్యాక్సినేషన్ సెంటర్ ల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపిలో నిన్న మొన్న నిలుపుదల చేసిన వ్యాక్సినేషన్ ను ఈ రోజు ప్రారంభించారు. అయితే ఇంతకు ముందు మాదిరిగా ఎవరు పడితే వారు వచ్చే విధంగా కాకుండా రోజుకు ఇంత మంది చొప్పున ఎఎన్ఎంల ద్వారా స్లిప్ లను పంపిణీ చేసి వారికి రెండవ డోసు వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ జాబితా తయారీలో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.