వివాదాస్పద వ్యాఖ్యల వివాదంలో చిక్కుకున్న బీజేపీ బహిష్కృత నేత నువుర్ శర్మ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దేశ వ్యాప్తంగా తన పై నమోదు అయిన అన్ని కేసులను ఒకే కేసుగా మార్చాలనీ, తనను పోలీసులు అరెస్టు చేయకుండా నిలువరించాలని పిటిషన్ లో అభ్యర్ధించారు. ఇంతకు ముందు నుపూర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించడంతో పాటు ఆమెపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యల వల్ల దేశం రావణకాష్టంగా తయారైందనీ, ఈ మొత్తాన్ని ఆమెదే బాధ్యత అని, మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని పేర్కొంది. కేసులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించాలని చెప్పింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. సువుర్ శర్మ పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయడం తీవ్ర సంచలనం కల్గించింది. ఈ నేపథ్యంలో సుపుర్ శర్మ మరో సారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ వివాదం నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆమెను పార్టీ నుండి బహిష్కరించింది. ఆమె బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. సువుర్ శర్మ పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ సారి ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
వైసీపీ ఎమ్మెల్యేలకు గుడ్, బ్యాడ్ న్యూస్లను చెప్పిన సీఎం వైఎస్ జగన్