Omicron variant: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ఊరట నిచ్చే అంశం వెల్లడించింది. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. విదేశాల నుండి వస్తున్న ప్రయాణీకలకు పరీక్షలు నిర్వహిస్తూ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారిని ఆసుపత్రికి, క్వారంటైన్ లకు తరలిస్తున్నారు. పలు దేశాలు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి. మన దేశంలోని కర్ణాటకలో రెండు కేసులు వెలుగు చూశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
Omicron variant: మరణాలు నమోదు కాలేదు
ఈ తరుణంలో ఒమైక్రాన్ వేరియంట్ తో ఇప్పటి వరకూ ఎవరూ చనిపోలేదని డబ్ల్యుహెచ్ఒ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ కు సంబంధించి ప్రపంచ దేశాల నుండి విస్తృత స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారమని జేనీవాలోని డబ్ల్యుహెచ్ఒ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మాయర్ తెలిపారు. ఒమైక్రాన్ విస్తృతంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యధిక టెస్టులు నిర్వహిస్తుండటం వల్ల మరిన్ని కేసులు గుర్తించగలమనీ, మరింత సమాచారాన్ని తెలుసుకోగలమని చెప్పారు. ప్రస్తుతం ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకూ అత్యంత ప్రభావం చూపిన వేరియంట్ గా డెల్టా వేరియంట్ గురించే చెబుతామని లిండ్మీయార్ అన్నారు. ఒమైక్రాన్ తీవ్రత ఏ మేరకు ఉంటుంది అన్న అంశంపై ప్రకటన చేసేందుకు మరి కొన్ని వారాల సమయం పడుతుందన్నారు. ఒమైక్రాన్ సంక్రమణ వేగం, వ్యాధి లక్షణాల తీవ్రత, దీనిపై వ్యాక్సిన్ల పని తీరు, చికిత్సకు స్పందించే తీరును ఇప్పట్లో చెప్పలేమనీ, ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని లిండ్మీయర్ స్పష్టం చేశారు.
ఎయిర్ పోర్టుల్లో విస్తృతంగా పరీక్షలు
కాగా ఒమైక్రాన్ అలజడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుండి వచ్చే ప్రయాణీలపై నిఘా కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఇతర దేశం నుండి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఖుతుబుల్లాపూర్ కు చెందిన ప్రయాణీకురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా పరారు అవ్వడం తీవ్ర కలకలాన్ని రేపింది. వెంటనే అధికారులు అప్రమత్తమై పాస్ పోర్టు పై ఉన్న అడ్రస్ అధారంగా ఆమె వెళ్లిన ఆపార్ట్ మెంట్ వెళ్లారు. అధికారులను చూసి అక్కడ నుండి ఎస్కేప్ కావడానికి ప్రయత్నించిన ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.