Parliament: పెగాసస్తో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష ఎంపిలు సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పేపర్లు చింపి స్పీకర్ చైర్ పైకి విసిరివేయడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే రెండు రెండు పర్యాయాలు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
తొలుత లోక్ సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులతో నినాదాలు చేశారు. వారి ఆందోళన కొనసాగుతుండగానే సభాపతి ప్రశ్నోత్తరాలను గంట చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనను మరింత ఉధృతం చేశారు. కొందరు కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చింపి స్పీకర్ చైర్, ట్రెజరీ బెంచ్ లపైకి విసిరివేయడంతో ఆగ్రహానికి గురైన సభాపతి సభకు మధ్యాహ్నం 12.30గంటలకు వాయిదా వేశారు. విరామం తరువాత సభ తిరిగి ప్రారంభం కాగా మళ్లీ సభ్యులు మరో సారి ఆందోళనకు దిగడంతో సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.
మరో పక్క రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. ప్రతిపక్షాల నిరసనతో రెండు సార్లు వాయిదా పడింది. పెగాసస్ పై చర్చ జరపాలంటూ వెల్ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు.