Presidential Poll: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా కొత్త నేత పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము బరిలోకి దిగమని ఎన్సీపీ నేత శరద్ పవార్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాతో సహా బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ లు తేల్చి చెప్పేసిన నేపథ్యంలో కొత్త నేత పేరు తెరపైకి వచ్చింది. సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. శరద్ పవార్ నేతృత్వంలో నేడు ఢిల్లీలో విపక్షాలు సమావేశం కానున్నాయి. ఈ భేటీలో యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అధికార బీజేపీ ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎస్టీ మహిళను ప్రకటించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తొంది. చత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికీ, జార్కండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మూలలో ఒకరిని రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ తరుణంలో ప్రతిపక్షాలు మాజీ బీజేపీ నేతను ఉమ్మడి అభ్యర్ధిగా రంగంలోకి దించాలని యోచన చేస్తున్నట్లు సమాచారం.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Presidential Poll: టీఎంసీ ఉపాధ్యక్షుడుగా ఉన్న యశ్వంత్ సిన్హా
మాజీ ఐఏఎస్ అధికారి అయిన యశ్వంత్ సిన్హా 1984లో జనతాదళ్ పార్టీలో చేరారు. ఆ తర్వాత బీజేపీ లో చేరారు. గత ఏడాది బీజేపీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరారు. ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. దివంగత మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి కి అత్యంత సన్నిహితుడుగా పేరున్న యశ్వంత్ సిన్హాకు వివిధ రాజకీయ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యశ్వంత్ సిన్హా అభ్యర్ధిత్వంపై ఇప్పటికే కొన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని అంటున్నారు. మమతా బెనర్జీ కూడా సిన్హా అభ్యర్ధిత్వంపై సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు మాజీ బీజేపీ నేత సిన్హా పేరును వ్యూహాత్మకంగానే తెరపైకి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
నేటి సమావేశానికి దీదీ డుమ్మా
అయితే ఈ రోజు ఢిల్లీలో శరద్ పవార్ నేతృత్వంలో నిర్వహించే విపక్షాల భేటీకి మమతా బెనర్జీ హజరుకావడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తొలుత చొరవ తీసుకుని విపక్షాలతో మొదటి భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ రెండవ సమావేశానికి దూరంగా ఉండటం గమనార్హం. తొలుత నిర్వహించిన విపక్షాల భేటీకి పలువురు ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపినా ఎవరూ హజరు కాలేదు. అందుకే ఈ రెండవ సమావేశానికి మమతా బెనర్జీ హజరు కాకుండా టీఎంసీ తరపున ప్రతినిధిని పంపుతున్నారని సమాచారం. మరో పక్క విపక్ష నేతల సమావేశానికి తమ పార్టీ ప్రతినిధిగా ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పంపుతున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.