కరోనా వైరస్ నివారణకు సంబంధించి నూతన సంవత్సరంలో తొలి రోజు ప్రజలకు శుభ వార్త అందింది. ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనెకా భాగస్వామ్యంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు మొట్టమొదటిగా యూకే అత్యవసర అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ భారత్ లోకి అందుబాటులోకి రానుంది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్ర ఔషద ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కోసం ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే టీకా పంపిణీకి డీసీజీఐ అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరో సంస్థ భారత్ బయోటెక్ ధరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. ఇందుకోసం భారత్ లోని సీరం ఇన్ స్టిట్యూట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ లోనూ వీటిని సరఫరా చేసేందుకు వీలుగా దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సీరం ఇన్ స్టిట్యూట్ వెల్లడించింది.
మరో పక్క దేశంలో కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు ఆందోళన కల్గిస్తోంది. యూకే నుండి స్వదేశానికి వచ్చిన వారిలో స్ట్రెయిన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కొత్త కరోనా వైరస్ బాధితుల సంఖ్య 29కి చేరింది. అయితే కొత్త స్ట్రెయిన్ వైరస్ ను కూడా ఎదుర్కొనే సామర్థ్యం తమ వ్యాక్సిన్ కు ఉందని అస్ట్రాజెనెకా ప్రకటించింది.