పార్లమెంట్ బడ్జెట్ సమావేసాలు మొదలైనప్పటి నుండి పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదానీ గ్రుప్ పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయడంతో పాటు కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనల పర్వం సోమవారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సభను మార్చి 13 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం అయినప్పటి నుండి విపక్ష ఎంపీల నిరసనలు కొనసాగాయి.
రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయడంతో చైర్మన్ అందుకు అంగీకరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. ఈ సందర్భంలో ఖర్గే చేసిన వ్యాఖ్యలను రికార్డు నుండి తొలగిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. అధికార, విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో పాటు పలువురు ఎంపీలు పోడియం ముందు నిరసన చేపట్టారు. చైర్మన్ ఎంతగా వారించినా సభ్యులు మాట వినలేదు. ఈ క్రమంలో సభను స్వల్ప సమయం పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ విపక్ష ఎంపీలు శాంతించలేదు.
ఇలా సభ్యుల ఆందోళన నడుమ సభను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్ ధన్ ఖడ్ .. విపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే ఆంటకం కలిగిస్తున్నారని ధన్ ఖడ్ వ్యాఖ్యానించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మీడియాతో మాట్లాడుతూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు విపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న తిరిగి ప్రారంభం అవుతాయి.
జనసేన పొత్తుల ఎఫెక్ట్ .. ఆ నియోజకవర్గంలో టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే