మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు, బాణం గుర్తును షిండే వర్గానికే కేటాయించింది. శివసేనలో చీలిక అనంతరం అసమ్మతి నేతగా గుర్తింపు పొందిన ఏక్ నాథ్ శిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత తమదే అసలైన శివసేన అంటూ ఏక్ నాథ్ శిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి. అయితే ఈ సమస్య ను పరిష్కరించేంత వరకూ ఇరువర్గాలు వేర్వేరు గుర్తులు ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.
తాజాగా ఏక్ నాథ్ శిండే నేతృత్వంలోని పార్టీనే అసలైన శివసేన అని ఈసీ గుర్తింపు ఇస్తూ నిర్ణయాన్ని వెలువడించిన నేపథ్యంలో శిండే వర్గం హర్షం వ్యక్తం చేస్తొంది. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయమని శిండే అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు శిండే. తమదే నికార్సయిన శివసేన అని తేలిందన్నారు. బాలా సాహెబ్ సిద్ధాంతాలను దృష్టిలో పెట్టుకుని తాము బీజేపీతో కలిసి గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
కాగా, శివసేన పార్టీ అధికారిక గుర్తింపునకు ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నది అనే అంశంపై ఈసీ వివరణ ఇచ్చింది. 2019 ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున గెలిచిన 55 మంది ఎమ్మెల్యేలు 76 శాతం ఓటింగ్ సాధించారనీ, వారందరి మద్దతు ఏక్ నాథ్ శిండే కు ఉందని వివరించింది. అటు ఉద్దవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేలకు 23.5 శాతం మాత్రమే ఓటింగ్ లభించిందని పేర్కొంది. ఈసీ నిర్ణయంపై ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈసీ నిర్ణయం ఊహించినదేనని అన్నారు. తాము కొత్త ఎన్నికల గుర్తుతో ముందుకు వెళతామని తెలిపారు. ఈ నిర్ణయంతో తామేమీ బాధపడటం లేదని పేర్కొన్నారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని రౌత్ స్పష్టం చేశారు. శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని తెలిపారు.
చంద్రబాబుపై పలువురు మంత్రులు ఫైర్ ..ఎవరు ఏమన్నారంటే..?