PM Modi: కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజికేఏవై) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్డుదారులకు అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పథకం ఈ నెలాఖరుతో ముగియనుండగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ పథకాన్ని సెప్టెంబర్ వరకూ పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించారు.
Read More: CM YS Jagan: ఏపి కేబినెట్ విస్తరణకు మూహూర్తం ఫిక్స్..ఎప్పుడంటే..?
PM Modi: సెప్టెంబర్ నెల వరకూ ఉచిత రేషన్ బియ్యం
ఉచిత రేషన్ పథకాన్ని తొలుత 2020 ఏప్రిల్ నెల నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని నవంబర్ 2020 వరకూ పొడిగించారు. ఆ తరువాత ఈ స్కీమ్ ను 2021 మార్చి వరకూ పొడిగిస్తున్నట్లు నాడు కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి అధికారికంగా ఉత్తర్వులు రాకపోవడంతో నవంబర్ 2020తో నిలుపుదల చేశారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 మే నెల నుండి నవంబర్ వరకూ మరో సారి కార్డుదారుల్లో సభ్యుడికి అయిదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. తరువాత మరల ఈ ఏడాది మార్చి వరకూ కేంద్రం పొడిగించింది. ఈ నెలతో ఉచిత రేషన్ పంపిణీ ముగియనున్న నేపథ్యంలో నేటి కేంద్ర కేబినెట్ లో మరో ఆరు నెలల పాటు పొడిగించే విధంగా చర్యలు చేపట్టారు.
ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ సుమారు రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసింది. వచ్చే ఆరు నెలల్లో మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నది. దీంతో పీఎం జీకేఏవై కింద మొత్తం వ్యయం దాదాపు రూ.3.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఒక ప్రకటనలో కేంద్రం తెలిపింది.