PM Modi: విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదన జరిగితేనే వారు ఉన్నతంగా రాణిస్తారనేది ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భావన. ఆ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ ఇంగ్లీషు మీడియం పాఠశాలలుగా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను పూర్తిగా ఎత్తివేయడంపై తెలుగు భాషాభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ప్రాధమిక స్థాయిలో మాతృభాషపై పట్టు ఉండాలనేది తెలుగు భాషాభిమానుల వాదన. ఓ పక్క రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాథ్యమాన్ని పూర్తిగా ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేలా సీఎం జగన్ అడుగులు వేస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృభాషకు ఊతం ఇచ్చేలా నూతన విద్యావిద్యానాన్ని ప్రకటించారు. దేశంలో ఇంజనీరింగ్ విద్యను తెలుగుతో పాటు అయిదు ప్రాంతీయ భాషల్లోనూ భోదించేలా సరికొత్తగా చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ గురువార ప్రకటించారు. గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ప్రాంతీయ భాషల ప్రాధాన్యత, ఆ భాషల్లో విద్యాబోధన ప్రాముఖ్యతను గురించి వివరించారు.
Read More: AP BJP Protests: ఏపిలో బీజేపీకి ఆందోళన అస్త్రాలను ఇస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు..
దేశంలో పేద, వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను మరింత చేరువ చేయడంతో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి మోడి తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యాబోధన అయిదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాన మంత్రి మోడి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యాబోధన ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులను 11 ప్రాంతీయ భాషల్లోకి అనువదించేలా ఓ టూల్ ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.