భారత దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి శనివారం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. తొలి రోజు ఎవరెవరికి వ్యాక్సిన్ వేయనున్న దానిపై ముందుగా నిర్ణయించిన ప్రకారం వాళ్లకు వ్యక్తిగతంగా సెల్ ఫోన్ ఎస్ఎంసిలు పంపారు.
వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలో వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చిందన్నారు. మరి కొన్ని స్వదేశీ వ్యాక్సిన్ లు కూడా రానున్నాయని అన్నారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులే వ్యాక్సిన్ తొలి హక్కుదారులని అన్నారు మోడి. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కరోనా విజృంభిస్తున్న వేళ సేవలు అందించారని కొనియాడుతూ వ్యాక్సిన్ పంపిణీలో వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.
దేశీయ వ్యాక్సిన్ తయారీలో భారత సత్తా మరో సారి ప్రపంచానికి నిరూపితమైందని మోడీ అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరి అని చెప్పారు. రెండవ డోసు ఎప్పుడు వేసుకోవాలని వారికి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు చూపిన ధైర్యాన్ని ఇప్పుడు కూడా చూపాలని అన్నారు. తొలి విడతగా మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తున్నామనీ, అలాగే రెండవ విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు. విదేశీ వ్యాక్సిన్ ల కంటే మన దేశంలోని వ్యాక్సిన్ లు చౌక ధరలకు లభిస్తున్నాయని మోడి పేర్కొన్నారు.
కాగా ఏపిలోని విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, తెలంగాణలో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ నిమ్స్ లో, గాంధీ ఆసుపత్రిలో మంత్రి ఈటెల రాజేందర్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు.