PM Modi : దేశ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 90వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ తరువాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రధమం. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఓ పక్క ఎన్నికల ప్రచారాల్లో బిజీ బిజీగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆదివారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం ఎక్కువ కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపించాలన్న కీలక నిర్ణయం తీసుకున్నది.
కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించిన ఉన్నత స్థాయి బృందం మహారాష్ట్రలో వైరస్ ఉదృతి ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రతినిధులను పంపాలని నిర్ణయించింది. అదే విధంగా పంజాబ్, చత్తీస్ గడ్ లకు కూడా కేంద్ర బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ నుండి 14 వ తేదీ వరకూ కరోనా జాగ్రత్తలు, మాస్క్ లు వాడకంపై రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. ముందుగా ప్రధాన మంత్రి మోడీ రాష్ట్రాల్లో, జిల్లాల్లో వ్యాక్సిన్ పంపిణీ, కరోనా కేసులు నమోదు, కేసులు పెరగడానికి కారణాలు, ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు తదితర విషయాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. పూర్తి స్థాయిలో వైరస్ అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేబినెట్ కార్యదర్శి, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశంలో నమోదు అవుతున్న కేసుల్లో 50 శాతం పైగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. కరోనా మహమ్మారి రెండవ సారి విజృంభిస్తుండటంతో ఉద్దవ్ ఠాకరే సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో వారంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.