వచ్చే 25 ఏళ్లలో భారత్ దేశాన్ని పూర్తి గా మార్చి వేయడానికి అయిదు లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఢిల్లీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ప్రధని హోదాలో మోడీ ఎర్రకోటపై 9వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత మోడీ రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందని మోడీ అన్నారు. ఎందరో త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్య్రమని అన్నారు. మహనీయులు మనకు స్వాతంత్య్రాన్ని అందించారని.. బానిస సంకెళ్ల ఛేదనలో వారి పోరాటం అనుపమానమని కొనియాడారు. మహత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మార్గదర్శకులని చెప్పారు. ఎంతో మంది సమరయోధులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలివేశారన్నారు.
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటిదని మోడీ అన్నారు. 75 ఎళ్ల స్వాతంత్య్రంలో దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయనీ, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని తెలిపారు. అభివృద్ధి వైపు పయనిస్తున్నామని అన్నారు. దేశం ఈ రోజు ఒక మైలు రాయిని దాటిందన్నారు. ప్రపంచం భారత్ వైపు చూసేలా చేయగలిగామని మోదీ తెలిపారు. ఆకలి కేకలు, యుద్ధాలు, తీవ్రవాదం సమస్యలకు ఎదురొడ్డి నిలిచామని పీఎం మోడీ వ్యాఖ్యానించారు. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి దానిని తరిమికొట్టగలిగామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేసుకోగలిగామని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్ మరింత ముందుకు వెళుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు మోడీ. బానిసత్వపు ఆలోచనలను మనసులో నుండి తీసిపారేయాలన్నారు. మన దేశ చరిత్ర, సంస్కృతి చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు.
ఐక్యమత్యంతో ప్రజలంతా కలిసి పని చేయాలి.. ప్రతి పౌరుడు తమ బాధ్యతను గుర్తుంచుకుని పని చేయాలని స్పష్టం చేశారు మోడీ. స్వచ్చభారత్, ఇంటింటికి విద్యుత్ సాధన అంత తేలికైన విషయం కాకున్నా లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తొందని అన్నారు. మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలమని పేర్కొన్నారు మోడీ. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని మోడీ వివరించారు. భారత మూలాలున్న విద్యా విధానానికి ప్రాణం పోయాలని, యువశక్తిలో దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీయాలన్నారు. డిజిటల్ ఇండియా ఇప్పుడొక కొత్త విప్లవమని, యువత స్టార్టప్ తో ముందుకొస్తొందన్నారు. అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల సరసన భారత్ ను నిలబెడదామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆశలను సాకారం చేయడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. వచ్చే 25 ఏళ్లు అమృతకాలం మనకు ఎంతో ప్రధానమైనదని పేర్కొన్నారు.
కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!