PM Modi: కరోనా సెకండ్ వేవ్ తుఫానులా దూసుకొచ్చింది, అన్ని వర్గాల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతం అవుతూ 24 గంటల వ్యవధిలో మూడు లక్షల వరకూ కేసులు చేరువ అవుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనాపై కఠిన పోరాటం చేస్తున్నామని అన్నారు. దేశంలో ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్ కు తగ్గ ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు.
దేశం కరోనాపై అతి పెద్ద యుద్ధం చేస్తోందనీ దేశ ప్రజలు ధైర్యాన్ని కోల్పోవద్దని మోడీ సూచించారు. భారీగా కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో సమిష్టి కృషితో విజయం సాధిస్తామని అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన మోడీ కోవిడ్ వారియర్స్ కు మరో సారి కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని ఫార్మా కంపెనీలను కోరామని అన్నారు. భారత్ లో అందరికీ అందుబాటులో ఉండేలా చవకగా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు దాటినవారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు.
కరోనా మహమ్మారి మనకి సవాల్ విసిరింది. దృఢ నిశ్చయంతో మనమందరం ఎదుర్కొవాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించేందుకు అందరి సహకారం అవసరమని అన్నారు. ప్రజల సహకారం అందితే లాక్ డౌన్ అవసరం ఉండదన్నారు. లాక్ డౌన్ నివారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సూచించారు. కోవిడ్ పై యుద్ధంలో మనమే మెరుగ్గా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదనీ, లాక్ డౌన్ చివరి అస్త్రంగా ఉండాలని మోడి అన్నారు.