ఈ నెల 16వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 16వ తేదీన వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్దేశించిన కేంద్రాలకు వ్యాక్సిన్ రవాణా జరుగుతున్నది. తొలి దశలో భాగంగా కోటి మందికి వ్యాక్సిన్ లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమై 1.65 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సేకరించింది. వీటిలో 1.1 కోట్ల డోసులు కోవిషీల్డ్ వి కాగా, మరో 55 లక్షల డోసులను భారత్ బయోటెక్ (కోవాగ్జిన్ ) నుండి తీసుకుంది.
కాగా జనవరి 16న తొలి రోజు దాదాపు 3 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2934 కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ లను అందించనున్నారు. ప్రతి కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రంలోనూ వ్యాక్సిన్ సంఖ్య కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలని, అవసరమైన వాటికంటే పది శాతం (రిజర్వు, వేస్టేజ్) డోసులు అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్యను రాష్ట్రాలు పెంచుకుంటూ వెళ్లాలని తెలిపింది.
ఇక కరోనా టీకా ను రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో ఇస్తారు. అయితే టీకా తీసుకున్న 14 రోజుల తరువాతే దాని ప్రభావం ప్రారంభం అవుతుందని ఇంతకు ముందే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకున్న వారు కోవిడ్ నిబందనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాగా వీటిలో ఏ టీకా తీసుకోవాలనే అప్షన్ ప్రస్తుతానికి లబ్దిదారులకు లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.