స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అత్యాధునిక తేలికపాటి యుద్ద హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఇతర సైనికాధికారులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ సింగ్ ‘ప్రచండ్’ హెలికాఫ్టర్ ప్రత్యేకను వివరించారు. దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాఫ్టర్ ‘ప్రచండ్’ భారత రక్షణ రంగ సత్తాను మరింత ఇనుమడింపజేయనుందన్నారు. ‘ప్రచండ్’ హెలికాఫ్టర్ లు క్షిపణులను, ఇతర ఆయుధాలను ప్రయోగించగలదన్నారు.
రక్షణ రంగ ఉత్పాదకతతో భారత్ సామర్థ్యాలను ప్రతిబంబించే దిశగా ఇది చారిత్రాత్మక సందర్భం అని రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ప్రభుత్వ రంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్) ఈ తేలికపాటి కంబాట్ హెలికాఫ్టర్ (ఎల్సీహెచ్) ను అభివృద్ధి చేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పోరాటానికి అనువుగా వీటిని తీర్చిదిద్దారు. ఈ హెలికాఫ్టర్ కు ‘ప్రచండ్’ అని నామకరణం చేశారు. దీని బరువు 5.8 టన్నులు. దీంట్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇప్పటికే ఇది అనేక పరీక్షలు పూర్తి చేసుకుంది. శత్రువుపై దాడి చేయడమే కాదు ప్రమాదం ఎదురైనప్పుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తప్పించుకోగలదు.
ఈ యుద్ధ హెలికాఫ్టర్ లను సమకూర్చేందుకు రెండేళ్ల క్రితం (2020 మార్చి నెలలో) ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోద ముద్ర వేసింది. ముందుగా 15 హెలికాఫ్టర్ ల కొరకు కేంద్ర ప్రభుత్వం రూ.3887 కోట్లు కేటాయించింది. వీటిలో పది హెలికాఫ్టర్ లు భారత ఎయిర్ ఫోర్స్ కి, మిగిలిన ఆయిదు ఆర్మీకి కేటాయించారు. నేడు జరిగిన కార్యక్రమంలో నాలుగు హెలికాఫ్టర్లను ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టారు.