Presidential Election 2022: ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ఆరంభించే అంశంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమి చేయాలనే అంశంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరో వైపు బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డీ ఏ వ్యూహాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నారు. అందుకే ఓ అడుగు ముందుకు వేసి ఎన్ డీ ఏ అభ్యర్ధిని ఓడించడమే లక్ష్యంగా మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్ధి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీతో సహా 22 విపక్ష పార్టీల అధినేతలకు 15 ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి ఆహ్వానం పంపారు మమతా బెనర్జీ. ఇదే క్రమంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కేసిఆర్ ది కీలక పాత్ర అంటూ ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యాఖ్యానించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Presidential Election 2022: బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కేసిఆర్
బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో నాయకత్వం చేయాలని కేసిఆర్ ఆలోచనలో ఉండగా, దీదీ మాత్రం కాంగ్రెస్ తో సహా ఇతర బీజేపీ వ్యతిరేక పక్షాలను కూడగట్టే పని లో ఉన్నారు. ఇలా భిన్న ఆలోచనలు వీరి మధ్య ఉన్నాయి. ఈ తరుణంలో దీదీ ఆహ్వానంపై కేసిఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కేసిఆర్ వరుస సమావేశాలు జరుపుతూ చర్చిస్తున్నట్లు సమాచారం. నేడు కూడా మరో సారి పీకేతో భేటీ అయి చర్చించారు కేసిఆర్. దీదీనే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించిన నేపథ్యంలో ఢిల్లీలో భేటీకి కేసిఆర్ వెళ్లాలనే యోచన చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ కేసిఆర్ హజరుకాలేకపోతే కేటిఆర్ ను పంపే అవకాశం ఉందని అంటున్నారు.
ఏకగ్రీవానికి బీజేపి కసరత్తు
వాస్తవానికి బీజూ జనతాదళ్, వైసీపీ మద్దతు తీసుకుంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డీఏ అభ్యర్ధి విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏకాభిప్రాయంతో రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తొంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అంశంపై చర్చించారనీ, వివిధ రాజకీయ పక్షాలతో మాట్లాడే బాధ్యతలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించినట్లు వార్తలు వినబడుతున్నాయి. చూడాలి ఏమి జరుగుతుందో.