Presidential Election: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విపక్ష నేతల భేటీలో కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి నిలపాలని తీర్మానం చేశారు. దీదీ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో 17 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఏపికి చెందిన వైసీపీ, టీడీపీలకు దీదీ అహ్వానం పంపలేదు. టీఆర్ఎస్, బీజేడీ, ఆప్, శిరోమణి అకాళిదళ్ పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Presidential Election: ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే ప్రక్రియకు నాంది
సమావేశం ముగిసిన తరువాత మమతా బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి అభ్యర్ధిని నిలిపే ప్రక్రియకు ఇది నాంది అని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్ధిత్వాన్ని నేతలు ఏకాభిప్రాయంతో అంగీకరించారనీ, అయితే శరద్ పవార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమ్మతించనందున ఇతర పార్టీల కు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయనీ, హజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని అన్నారు మమతా బెనర్జీ. సమావేశానికి హజరుకాని వారిని సైతం సంప్రదిస్తామని, ఇది ఒక మంచి ఆరంభమని పేర్కొన్నారు. కొన్ని నెలల తర్వాత అంతా కలిసి సమావేశమైయ్యామనీ, భవిష్యత్తులోనూ ఇలాంటి సమవేశాలు జరుగుతాయని మమతా బెనర్జీ చెప్పారు. భారత రాజ్యాంగానికి సంరక్షకుడిగా సేవ చేయగల్గిన అభ్యర్ధి, ప్రజాస్వామ్యాన్ని, దేశ సామాజిక నిర్మాణానికి మరింత నష్టం కలిగించకుండా మోడీ ప్రభుత్వాన్ని నిలువరించగలిగే వ్యక్తిని నిలపాలని నిర్ణయించినట్లు సుధేంద్ర కులకర్ణి తెలిపారు.
ఏకాభిప్రాయంతో కూడిన ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీలతో మరో సారి వచ్చే వారంలో సమావేశం జరపాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి అభ్యర్ధి ఎంపిక చేసేందుకు వివిధ పార్టీల నేతలతో మమతా బెనర్జీ, శరద్ పవార్, మల్లికార్జున ఖర్గే చర్చలు జరుపుతారని సమాచారం. సమావేశంలో ఎన్సీపీ నేత శరద్ పవార్, ప్రపుల్ పటేల్, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరామ్ రమేష్, రణదీప్ సుర్జీవాలా, జేడిఎస్ నేతలు దేవగౌడ, కుమారస్వామి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.