రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ లోని రూమ్ 63లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్ లో నిలబడి ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తొలి ఓటు వేశారు. ఆ తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం, అనంతరం మంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తరువాత ఎమ్మెల్యేలు క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
తెలంగాణలో మొదటగా మంత్రి కేటిఆర్ ఓటు వేశారు. ఆ తరువాత మంత్రులు ఎమ్మెల్యేలు క్యూలైన్ లో నిలబడి ఓటు వేస్తున్నారు. ఏపికి చెందిన కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీదర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానంలో పోలింగ్ జరుగుతోంది. ఎంపీలకు ఆకు పచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు ఇస్తున్నారు. 4809 మంది ఎలక్టరోరల్ కాలేజీ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.