మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులు అన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి ఇక పై ఎక్కడైనా ఆమెపై కేసులు నమోదు అయినా అవి కూడా ఢిల్లీకి బదిలీ అవుతాయని వెల్లడించింది. ఇక పై ఈ కేసులను ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తారని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుల్లో అరెస్టు కాకుండా జూలై 19న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాకక అంతర్జాతీయంగా తీవ్ర వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమెను పార్టీ బహిష్కరించింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశంలో పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. ఆమె పై వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఆమెకు బెదిరింపు లు వచ్చాయి. ఆ నేపథ్యంలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ నుపుర్ శర్మ గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆమె అభ్యర్ధనను తిరస్కరించారు.
నుపుర్ శర్మపై ఇద్దరు సుప్రీం న్యాయమూర్తులు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, విశ్రాంత ఐఏఎస్ లు న్యాయమూర్తుల వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు. ఆ తదుపరి మరో సారి నుపుర్ శర్మ..సుప్రీం కోర్టును ఆశ్రయించగా బుధవారం విచారణ జరిపింది. ప్రాణహాని ఉందన్న విషయంలో ఏకీభవిస్తూ ఇటువంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లి విచారణకు హజరు కావడం ఇబ్బందేనని అభిప్రాయపడిన సుప్రీం ధర్మాసనం.. ఆ కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.