Puducherry: జనాభాలో సగ భాగం ఉన్న మహిళలు అనేక రంగాల్లో తమ ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. అయితే రాజకీయ రంగంలో పదవుల విషయంలో ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ కారణంగా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుఛ్చేరి అసెంబ్లీలో నాలుగు దశాబ్దాలుగా మహిళా నేతలకు మంత్రి వర్గంలో చోటు లభించలేదు. 40 ఏళ్ల తరువాత ఓ మహిళా నేత మంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి బీజెపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్న వేళ మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి వర్గ జాబితాను ఎల్టీ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ అందజేశారు. ఈ మంత్రి వర్గ జాబితాకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రుల మాదిరిగా కాకుండా రంగస్వామి తన కేబినెట్ లోకి మహిళా నేతను తీసుకున్నారు. కారైక్కాల్ ప్రాంతంలోని నెడుంగాడు రిజర్వుడ్ స్థానం నుండి విజయం సాధించిన ఎన్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత చందిరా ప్రియాంగ మంత్రిగా అవకాశం కల్పించారు. ఆదివారం పుదుఛ్చేరి రాజ్ భవన్ లో మంత్రులతో ఎల్టీ గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వకారం చేయించారు. కోవిడ్ నేపథ్యంలో మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని పరిమిత సంఖ్యలో అతిధుల మధ్యనే నిర్వహించారు.
1980 -83 లో కాంగ్రెస్, డీఎంకే కూటమి మంత్రి వర్గంలో డీఎంకే కు చెందిన రేణుక అప్పాదురై మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత నుండి ఇప్పటి వరకూ రాష్ట్రంలో మహిళా నేతలకు మంత్రి పదవులు వరించలేదు. మహిళా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ లు వచ్చినా ముఖ్యమంత్రులు అవకాశం కల్పించలేదు. నాలుగు దశాబ్దాల తరువాత రంగస్వామి మంత్రివర్గంలో మహిళా నేతకు మంత్రి పదవి వరించడంతో ఆ ప్రాంతంలోని మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రంగస్వామికి మహిళాలోకం హాట్సాఫ్ చెబుతోంది.