కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్ లో కొనసాగుతుండగా, శనివారం యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత, జలంధర్ ఎంపీ సంటోఖ్ సింగ్ చౌదరి గుండె పోటుతో కన్నుమూశారు. శనివారం లుథియానా ఫిలౌర్ నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించగా, ఈ యాత్రలో ఎంపి సంటోఖ్ సింగ్ చౌదరి రాహుల్ తో కలిసి నడిచారు. అయితే కొద్ది సేపటికే సంటోఖ్ సింగ్ చౌదరి కుప్పకూలిపోయారు. గుండె వేగంగా కొట్టుకోవడంతో రాహుల్ యాత్రలో ఉన్న అంబులెన్స్ లో ఆయనను హుటాహుటిన ఫగ్వారాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండె పోటుతోనే ఆయన మరణించినట్లుగా వైద్యులు దృవీకరించారు.
కాగా విషయం తెలిసిన వెంటనే రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ వేశారు. రాహుల్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి ఎంపి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సంతోక్ సింగ్ చౌదరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. సంటోక్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. సంటోఖ్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత యాత్ర ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ నేత తెలిపారు. రాహుల్ గాంధీతో ఇంకా మాట్లాడలేదనీ, కానీ అంత్యక్రియల తర్వాత యాత్ర ప్రారంభిస్తామని తాము భావిస్తున్నామన్నారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు యాత్రను సస్పెండ్ చేస్తామని ఆయన తెలిపారు.
సంటోఖ్ సింగ్ చౌదరి మరణంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంతాపం తెలియజేశారు. చౌదరి మరణం పార్టీకి తీరని లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో వైపు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఎంపి చౌదరి మృతి పై ట్విట్టర్ వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. సంటోఖ్ సింగ్ చౌదరి జలంధర్ నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.