రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది సుప్రీం కోర్టు. ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నళిని, రవిచంద్రన్, రాబర్ట్, రాజా, శ్రీహరణ్, జై కుమార్ ను విడుదల చేయాలని ఆదేశించింది. దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో మరో నిందితుడుగా ఉన్న పెరరివాళన్ ను మే 17న విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామనీ, అది వీరికీ కూడా వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
దోషులు దాదాపు 30 సంవత్సరాలపాటు జైలు జీవితం గడపడంతో పాటు సత్ప్రవర్తన నేపథ్యంలో 2018 సెప్టెంబర్ 9న దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వ కేబినెట్ సిఫార్సు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినా గవర్నర్ .. రాష్ట్రపతికి సిఫార్సు చేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి పెరరివాళన్ విడుదలకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గతంలో ఆదేశాలు జారీ చేసింది. దాంతో పెరరివాళన్ విడుదల అయ్యారు. ఇప్పుడు తాజాగా మిగిలిన ఆరుగురు దోషుల విడుదలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉండగా 1991 మే 21 ఆత్మాహుతి దాడి జరిగింది. ధను అనే మహిళ తనకు తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీ తో పాటు మరో 14 మంది మరణించారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ 1998 లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. అయితే ఆ మరుసటి ఏడాది పెరరివాళన్ సహా మురగన్, నళిని, శాంతన్ మరణ శిక్షను సుప్రీం కోర్టు నిలిపివేసింది. 2014 లో పెరరివాళన్ తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. అదే క్రమంలో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణ శిక్షను కూడా యావజ్జీవ జైలు శిక్షగా తగ్గించారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో చీకోటి ప్రవీణ్ భేటీ .. ఎందుకంటే..?