సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నళిని, ఆమె భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్ సహా ఆరుగురు దోషులు తమిళనాడు జైళ్ల నుండి శనివారం విడుదల అయ్యారు. ప్రస్తుతం పెరోల్ పై ఉన్న నళిని తను శిక్ష అనుభవిస్తున్న వెల్లూరులోని ప్రత్యేక మహిళా కారాగారానికి వెళ్లి విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. అక్కడి నుండి వెంటనే వెల్లూరు సెంట్రల్ జైలుకు చేరుకుని విడుదలైన తన భర్త వి శ్రీహరన్ (మురగన్) ను చూసి భావోద్వేగానికి గురైయ్యారు.
మురుగన్, సంథన్ లు సెంట్రల్ జైలు నుండి విడుదల కాగానే వారు శ్రీలంక దేశస్తులైనందున పోలీసు వాహనంలో వారిని తిరుచిరాపల్లి ప్రత్యేక శరణార్ధుల శిబిరానికి తరలించారు. శ్రీలంక దేశస్తులైన మరో ఇద్దరు దోషులు రాబర్ట్ పాయస్, జయకుమార్ చెన్నైలోని పుజల్ సెంట్రల్ జైలు నుండి విడుదల కాగా వారిని కూడా తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శరణార్ధుల శిబిరానికి తరలించారు. ఈ నలుగురిని అక్కడ ఉంచనున్నారు. వీరిని స్వదేశం శ్రీలంక పంపే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. కాగా నళిని చెన్నైలో ఉంటారా లేక లండన్ లోని తన కుమార్తె వద్దకు వెళ్తారా అనేది ఇంకా తెలియరాలేదు.
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులు 30ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారివాలన్ ను రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద దఖలు పడిన అసాధారణ అధికారులను ఉపయోగించి సుప్రీం కోర్టు ఈ ఏడాది మే 18న విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అదే తీర్పు మిగిలిన ఆరుగురు దోషులకు వర్తిస్తుందని శుక్రవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ బివి నాగరత్నల నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేస్తూ విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది.