Army Chopper Crash: తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో తొలి త్రివిధ దళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ నేడు పార్లమెంట్ లో వివరాలు వెల్లడించారు. బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ నుండి నిన్న మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుండి సంకేతాలు నిలిచిపోయాయన్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లారనీ, అప్పటికే హెలికాఫ్టర్ మంటల్లో కాలిపోవడం వారు గమనించారన్నారు. అనంతరం శిధిలాల నుండి అందరినీ వెలికి తీసి ఆసుపత్రికి తరలించగా 13 మంది మృతి చెందారని తెలిపారు. ఈ ప్రమాదంలో రావత్ సహా అంత మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. రావత్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో రేపు జరుగుతాయని తెలిపారు.
Army Chopper Crash: వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు
హెలికాఫ్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారనీ, ఆయనకు సైనిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందన్నారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. హెలికాఫ్టర్ ప్రమాద ఘటనపై ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. కాగా సీడీఎస్ రావత్ సహా 13 మంది మృతి పట్ల పార్లమెంట్ సంతాపం వ్యక్తం చేసింది. తొలుత పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సహా రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సమావేశమైయ్యారు. మరో వైపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు వెల్లింగ్టన్ లోని మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో ఉన్న రావత్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.