NCT Bill : దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు, ఆందోళనలు, వాకట్ ల మధ్య బుధవారం రాత్రి అధికార పార్టీ ఈ బిల్లును పాస్ చేసుకుంది. ఈ బిల్లు ఇది వరకే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తరువాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెప్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వహక నిర్ణయాలు తీసుకోలోని పరిస్థితి ఏర్పడుతుంది.
బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. కాంగ్రెస్, బీజేడి, వైఎస్ఆర్ సీపీ, సమాజ్ వాది పార్టీ లతో సహా పలు పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సభ్యులు దుయ్యబట్టారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు.
అమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయినందున కేంద్రంలోని బీజేపీ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. మహా భారతంలో ద్రౌపదికి జరిగిందే..ఈ రోజు భారత రాజ్యాంగానికి జరిగిందని సంజయ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ బిల్లు చట్ట సవరణలు ఏ విధంగానూ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం కాదని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో 1991లో కాంగ్రెస్ తీసుకువచ్చిన చట్టానికే సవరణలు చేశాము తప్ప ఇది కొత్తది కాదని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకురావడంలో రాజకీయ కోణం ఏమీ లేదనీ, ఢిల్లీ ప్రభుత్వం సక్రమంగా పని చేసేందుకు ఈ సవరణలను తీసువచ్చామని ఆయన అన్నారు.