Rajya Sabha Election Results 2022: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాల్లో బీజేపీ వ్యూహం ఫలించలేదు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన మీడియా మొఘల్ జీ నెట్ వర్క్ అధినేత, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పరాజయం పాలైయ్యారు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని బీజేపీ భావించి చివరి నిమిషంలో సుభాష్ చంద్రను రంగంలోకి దింపి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాజస్థాన్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ మూడు, బీజేపీ ఒకటి గెలుచుకునే అవకాశం ఉండగా, అయిదవ అభ్యర్ధిగా సుభాష్ చంద్ర బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దిగడంతో నాల్గవ స్థానానికి పోటీ నెలకొంది.
Rajya Sabha Election Results 2022: సుభాష్ చంద్ర ఓటమి
కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన ముకుల్ వాస్నిక్, రణదీప్ సుర్జీవాలా, ప్రమోద్ తివారీ గెలుపొందగా, బీజేపీ నుండి ఘన శ్యామ్ తివారీ విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధిగా చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసిన సుభాష్ చంద్ర ఓటమి పాలైయ్యారు. తొలుత ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులుగా ఎంపిక చేయడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే నుండి అసమ్మతి వ్యక్తం అయ్యింది. రాజస్థాన్ లో చాలా మంది నాయకులు ఉండగా ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడినట్లు వార్తలు వచ్చాయి. ఇదే అవకాశంగా బీజేపీ స్వతంత్ర అభ్యర్ధిని రంగంలోకి దింపి చేతులు కాల్చుకుంది.
ఇక నాలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ నుండి పోటీ చేసిన నిర్మలా సీతారామన్ , జగ్గేష్, లహర్ సింగ్ విజయం సాధించగా కాంగ్రెస్ నుండి జైరాం రమేష్ గెలుపొందారు. కాంగ్రెస్ నుండి పోటీ చేసిన మన్సూర్ ఆలీఖాన్ , జేడిఎస్ నుండి బరిలో నిలిచిన డి కుపేంద్ర రెడ్డి పరాజయం పాలైయ్యారు. మహారాష్ట్ర నుండి బీజేపీ తరపున పోటీ చేసిన పీయూష్ గోయల్, అనిల్ బొండే, ధనుంజయ్ మహాదిక్, మహా వికాస్ అఘాడీ నుండి ప్రపుల్ పటేల్ (ఎన్సీపీ) సంజయ్ రౌత్ (శివసేన), ఇమ్రాన్ ప్రతాప్ గర్హి (కాంగ్రెస్) గెలుపొందారు. శివసేన నుండి పోటీ చేసిన మరో అభ్యర్ధి సంజయ్ పవార్ ఓటమిపాలైయ్యారు. హర్యానా నుండి బీజేపీ అభ్యర్ధి క్రిషన్ లాల్ పన్వార్, ఇండిపెండెంట్ అభ్యర్ధి కార్తికేయ శర్మ విజయం సాధించగా, కాంగ్రెస్ నుండి పోటీ చేసిన అజయ్ మాకెన్ పరాజయం పాలైయ్యారు. ఈ ఎన్నికల్లో పలు చోట్ల క్రాస్ ఓటింగ్ జరగడం పార్టీల్లో కలవరాన్ని రేకెత్తిస్తొంది.