నిన్న లోక్ సభలో నలుగురు పార్లమెంట్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా, ఈ రోజు రాజ్యసభలో విపక్షాలకు చెందిన 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్. నిరసనలతో గందరగోళం సృష్టిస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కల్గిస్తున్న నేపథ్యంలో 19 మంది సభ్యులకు రాజ్యసభ డిప్యూటి చైర్మన్ హరివంశ్ నారాయణ్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ వారం చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళధరన్ ఈ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు. డిప్యూటి చైర్మన్ ఈ తీర్మానం ఆమోదం పొందినట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సబ్యులు తక్షణమే సభ ను వీడాలని సూచించారు. సభను తొలుత 20 నిమిషాలు వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్.
సస్పెండ్ అయిన సభ్యుల్లో సుస్మితా దేవ్, శాంతను సేన్, కనిమొళి, మౌసుమ్ నూర్, శాంతా ఛెత్రీ, నదుముల్, రహీమ్, గిరిరాజన్, వద్దిరాజు రవి, దామోదరావు, లింగయ్య యాదవ్ ఉన్నారు. సస్పెండ్ అయిన టీఎంసీకి చెందిన ఏడుగురు, డీఎంకే కి చెందిన ఆరుగురు, సీపీఎంకు చెందిన ఇద్దరు, సీపీఐ ఎంపి ఒకరు, టీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు ఈ వారం వరకు సభకు హజరుకావద్దని ఆదేశించారు. అయితే సస్పెండ్ అయిన సభ్యులు సభను వీడకుండా అక్కడే నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు ఆటంకం కల్గిస్తున్నందున సభను మరో గంట పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి చైర్మన్ ప్రకటించారు.
పార్లమెంట్ వర్షాకాల సమవేశాల్లో భాగంగా ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వంటి అంశాలను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. దీంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభిస్తున్నాయి. మంగళవారం కూడా రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనలకు దిగారు. సభ్యుల ఆందోళనల నడుమ చైర్మన్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. అయినప్పటికీ ఎంపీలు వెల్ లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ పలు మార్లు వాయిదా పడింది. చివరకు 19 మంది సభ్యులను సస్పెండ్ చేశారు డిప్యూటి చైర్మన్. అటు లోక్ సభలోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా లోక్ సభలో సోమవారం నలుగురు కాంగ్రెస్ ఎంపిలపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, జి ఎన్ ప్రతాపన్, జోతిమణి, రమ్యా హరిదాస్ లను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ సభాపతి ప్రకటించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ ముజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదించింది.