Ayodhya : దేశ వ్యాప్తంగా ఎంతో చరిత్ర కల్గి ఉన్న అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటి విరాళాల సేకరణ నిలుపుదల చేసినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ దాయ్ వెల్లడించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఇటీవల కాలం వరకూ దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజెపీ, విశ్వహిందూ పరిషత్ తదితర, భజరంగ్ దళ్ తదితర హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా జనవరి 14వ తేదీ నుండి ఫిబ్రవరి 27వ తేదీ వరకూ విరాళాలను సేకరించారు. పలు ప్రాంతాల్లో విరాళాల సేకరణ విషయంలో కొంత దురుసుగా కూడా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇకపై విరాళాలను వెబ్ సైట్ ద్వారా మాత్రమే సేకరించాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకున్నది.
కాగా ఫిబ్రవరి 4వ తేదీ నాటికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, గ్రామాల నుండి రూ.2,500 కోట్ల మేర విరాళాలు వచ్చినట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ దాయ్ వెల్లడించారు. విరాళాల సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాల్లో తొమ్మిది లక్షల మంది కార్యకర్తల ద్వారా విరాళాల సేకరణలో పాలు పంచుకున్నారని చెప్పారు. మరో మూడేళ్లలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి గత ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే.