కేంద్రంలో ఎన్డీఏ కూడమి రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి మోడీ భాగస్వామ్య పక్షాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే బీజెపీ అత్యధికంగా 303 పార్లమెంట్ స్థానాలు కైవశం చేసుకోవడంతో భాగస్వామ్య పక్షాలతో చర్చించకుండానే కేంద్రంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. దీంతో ఒక్కటొక్కడిగా భాగస్వామ్య పార్టీలు బీజేపీకి దూరం అవుతున్నాయి.
మహారాష్ట్రలో శివసేనతో అసెంబ్లీ ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాన్ని బీజెపీ దిక్కరించడంతో శివసేన ఆ పార్టీకి దూరమై శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జత కట్టి అధికారాన్ని హాస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్డీఏకు దూరం అయ్యింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి బీజెపీకీ షాక్ ఇచ్చారు. ఉభయ సభల్లో నూతన వ్యవసాయ బిల్లలు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలుగా అయిన నేపథ్యంలో పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన రైతాంగం…కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో చివరకు వారి ఆందోళనను ఢిల్లీ సరిహద్దులలో చేయడం ఆరంభించారు. కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడం, రైతు సంఘాల ఏకైక డిమాండ్ పై కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో ఆందోళనను తీవ్రతరం చేస్తున్నాయి.
ఈ తరుణంలో తాజాగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) ఎన్ డీ ఏ కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుండి బయటికి వస్తున్నట్లు ఆ పార్టీ అధినేత హనుమాన్ బేనీవాల్ ప్రకటించారు. దీంతో ఆర్ ఎల్ పీతో కలిపి ఎన్ డీ ఎ నుండి బయటకు వచ్చిన పార్టీల సంఖ్య మూడుకు చేరింది. రైతుల వ్యతిరేకంగా వ్యవహరించే వారి పక్షాన తాము ఉండమని ఆర్ ఎల్ పీ అధ్యక్షుడు హనుమాన్ బెనీవాల్ తెలిపారు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో శనివారం నిర్వహించిన రైతుల ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో బీజెపీలో కీలకనేతగా ఎదిగిన హనుమాన్ బెనీవాల్ 2018 రాజస్థాన్ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి ఆర్ ఎల్ పీ స్థాపించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజెపీతో పొత్తుపెట్టుకున్న ఆర్ఎల్పీ ఇప్పటి వరకూ ఎన్డీఏ కూడమిలో కొనసాగింది.