సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల నియామకానికి గత ఏడాది డిసెంబర్ లో కొలీజియం చేసిన అయిదు ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయిదుగురు హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి డిసెంబర్ 13న కొలీజియం సిఫార్సు చేసింది. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, మణిపుర్ హైకోర్టు సీజే జస్టిస్ పివీ సంజయ్ కుమార్, పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.

అయితే హైకోర్టు జడ్జీల పదోన్నతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై నిన్న రెండు పిటిషన్ల పై విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయం. మరీ అసౌకర్యం కలిగించే నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని ప్రోత్సహించవద్దు అని ఏజీకి స్పష్టం చేసింది. ఆ సమయంలో అటార్నీ జనరల్ (ఏజీ) ఆర్ వెంకటమణి త్వరలో కొలీజియం చేసిన అయిదు సిఫార్సలను కేంద్రం ఆమోదం తెలుపుతోందని వెల్లడించారు.
ఈ తరుణంలో అయిదుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం శనివారం ఆమోదం తెలిపింది. కొత్త న్యాయమూర్తుల నియామకంతో సుప్రీం కోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది. కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారు ఈ నెల 6వ తేదీ (సోమవారం) ప్రమాణ స్వీకారం చేస్తారని సుప్రీం కోర్టు వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు ప్రాంగణంలో 6వ తేదీ ఉదయం 10.30 గంటలకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని పేర్కొన్నాయి. కొత్తగా నియమితులైన సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు న్యాయశాఖ మంత్రి కిరిణ్ రిజుజు అభినందనలు తెలియజేశారు.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్కు ఏపీ సర్కార్ కీలక లేఖ