ఇటీవల కాలంలో కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చిన సందర్భాల్లో న్యాయమూర్తులను టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తీర్పులను విమర్శిస్తున్న సందర్భాల్లో కొందరు పరిధులు దాటడం వల్ల కోర్టు దిక్కార కేసులను ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పుల విషయంలో కొన్ని మీడియాలు వ్యవహరిస్తున్న తీరుపైనా ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆక్షేపణ, ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ కేసు విషయంలో తీవ్ర కామెంట్స్ చేసిన ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆక్షేపణలు వచ్చాయి. ఈ విషయంలో రిటైర్డ్ న్యాయమూర్తులు, విశ్రాంత ఐఏఎస్ లు .. న్యాయమూర్తుల వైఖరిని తప్పుబడుతూ ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తికే బహిరంగ లేఖ రాశారు.
న్యాయమూర్తులను విమర్శించడం సరికాదు
ఇలా కోర్టు తీర్పులు, న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ యూయూ లలిత్ స్పందించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కోర్టులు వెలువరించే తీర్పులను విమర్శిస్తే నష్టం లేదు కానీ వ్యక్తిగత కారణాలతో న్యాయమూర్తులను విమర్శించడం సరికాదని కాబోయే సీజేఐ జస్టిస్ యుయు లలిత్ అన్నారు. తీర్పులపై నిర్మాణాత్మక విమర్శలను ఎవరైనా చేయవచ్చని, అయితే న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా ఆపాదించడం తగదన్నారు. ఒక జడ్జి తన జడ్జిమెంట్, ఉత్తర్వుల ద్వారా మాట్లాడతారని చెప్పారు. కాబట్టి విమర్శలు కేవలం తీర్పులపై మాత్రమే ఉండాలని అన్నారు జస్టిస్ యూయూ లలిత్.
ఎవరైనా సరే తీర్పులను మాత్రమే చూడాలని.. వాటి వెనుకున్న న్యాయమూర్తులను చూడరాదని ఆయన చెప్పారు. తీర్పులపై కౌంటర్ వేసే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోందని అయితే వీటిపై న్యాయమూర్తులు వెంటనే ప్రతిస్పందించరని దీన్ని బలహీనతగా చూడకూడదని ఆయన హితవు పలికారు. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ అవుతున్నారు. ఆయన స్థానంగా జస్టిస్ యూయూ లలిత్ ఈ నెల 27వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.