Delhi Gang Rape Case: 2012 చావ్లా సామూహిక హత్యాచారం కేసులో దోషులను బిగ్ రిలీఫ్ ఇస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఢిల్లీలోని ట్రయల్ కోర్టు, హైకోర్టు దోషులుగా నిర్దారిస్తూ ఇచ్చిన ఉరి శిక్ష తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కన పెట్టింది. సోమవారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
2012 ఫిబ్రవరి 9న ఢిల్లీ చావ్లా ప్రాంతంలో ఉత్తరాఖండ్ కు చెందిన ముగ్గురు యువకులు 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం చిత్ర హింసలకు గురి చేశారనీ.. దాంతో ఆమె మృతి చెందిందన్న అభియోగంతో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో విచారణ జరిపిన డిల్లీ ట్రయల్ కోర్టు .. 2014 ఫిబ్రవరి నెలలో ముగ్గురు నిందితులను దోషులుగా నిర్దారించి ఉరి శిక్ష విధించింది. ట్రల్ కోర్టు తీర్పును నిందితులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు .. అదే ఏడాది ఆగస్టు 26న ట్రయల్ కోర్టు తీర్పునే సమర్ధిస్తూ తీర్పు వెల్లడించింది.
తమకు విధించిన మరణ శిక్ష రద్దు చేయాలని ముగ్గురు దోషులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు వారికి ఊరట కల్గించింది. వారికి విధించిన ఉరి శిక్షను రద్దు చేయడంతో పాటు నిర్దోషులుగా ప్రకటిస్తూ సీజేఐ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఈ తీర్పు సమయంలో కోర్టు హాలులో ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. తీర్పును చదివే సమయంలో బాదితురాలి తండ్రి చేతులు జోడించి నిల్చోగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితురాలి తండ్రి బాదను తాను అర్ధం చేసుకోగలనని, కానీ వాస్తవాలు, సాక్షాధారాలపైనే తీర్పు ఉంటుందని సీజేఐ పేర్కొన్నారు. సెంటిమెంట్లను పరిగణలోకి తీసుకుంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉందని, ఆ ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.