బిజినెస్ టైకూన్, కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోర్టు దిక్కార కేసులో ఆయనకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీం కోర్టు. అలాగే రూ.2వేల జరిమానా విధించింది. జస్టిస్ యూయూ లతి, జస్టిస్ రవింద్ర ఎస్ భట్, జస్టిస్ పీఎస్ నరసింహాల కూడిన త్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. విజయ్ మాల్యా బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లిపోయారు. 2016 నుండి యూకే లో ఉంటున్నారు. రుణాల ఎగవేతకు సంబంధించి విజయ్ మాల్యా పై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం గతంలో సుప్రీం కోర్టులో పలు పిటిషన్ లు దాఖలు చేయగా, కోర్టు ఆయన ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే విజయ్ మాల్యా తన బ్రిటిష్ సంస్థ డియాగోను విక్రయించగా వచ్చిన 40 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) తన పిల్లలకు బదిలీ చేశారని 2017 లో బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లి, ఈ సమాచారాన్ని న్యాయస్థానం వద్ద దాచారని, ఇది పూర్తిగా కోర్టు ఆదేశాల ఉల్లంఘనేనని పేర్కొంటూ పిటిషన్ లో పేర్కొంది. ఆయనపై కోర్టు దిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరింది బ్యాంకుల కన్సార్షియం. ఆ పిటిషన్ పై అదే ఏడాది విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. విజయ్ మాల్యా న్యాయస్థానం ఆదేశాలను దిక్కరించారని తేల్చింది. అతనిపై కోర్టు దిక్కరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ తీర్పు సవాల్ చేస్తూ మాల్యా పిటిషన్ దాఖలు చేయగా 2020 ఆగస్టులో దాన్ని కోర్టు కొట్టివేసింది. ఆయనను కోర్టు ఎదుట హజరుకావాలని స్పష్టం చేసింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా విజయ్ మాల్యా కోర్టుకు హజరుకాకపోవడంతో మరో సారి విచారణ జరిపిన సుప్రీం కోర్టు .. ఈ ఏడాది మార్చి 10న తీర్పును రిజర్వ్ లో పెట్టి నేడు వెల్లడించింది.
విజయ్ మాల్యా తన పిల్లలకు బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్ల నగదును నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా కోర్టుకు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయకుంటే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయంపై అక్కడి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో విజయ్ మాల్యా బెయిల్ పై ఉన్నారు.
తమిళనాడు: పన్నీరు సెల్వంకు షాక్ .. అన్నా డీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నిక