పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ మొన్న ఉదయం గంటన్నర పాటూ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ ఏకాంతంగానే మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో పీకే బృందంలో ఒక సభ్యుడు ఆయన అడిగిన పత్రాలు తీసుకెళ్లి ఇచ్చి వచ్చారు..! ఈ భేటీ దేని గురించి..? మ్యాటర్ ఏమై ఉంటుంది..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది..! ఇదే ఇప్పుడు చెప్పుకుందాం. ఇదే సందర్భంలో పీకే ఆరోజు సాయంత్రం కేటీఆర్ తో కూడా భేటీ అయ్యారు. ఇటు జగన్, అటు కేటీఆర్ తో ఒకేరోజు పాకీ కలవడంలో పెద్ద విశేషం/ వింత ఏమి లేదు. కొన్ని నెలలుగా ఢిల్లీ, కల్కటాలో బిజీగా ఉంటున్న పీకే ఈ ఇద్దరి అపాయింట్మెంట్ తీసుకుని, ఒకేరోజు రెండు పనులు ముగించుకున్నారు..!
జగన్ తో భేటీ కారణాలు ఇవే..!?
2019 ఎన్నికల్లో పీకే జగన్ కోసం పనిచేసారు. వైసీపీ గెలుపు కోసం అగ్రిమెంట్ ప్రకారం ఎన్నికల వ్యూహకర్తగా పని చేసారు. అది విజయవంతమవ్వడంతో ఇప్పటికీ ఈ ఇద్దరి బంధం కొనసాగుతుంది. మొన్నటి భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అందులో “ఇండియాలో ప్రాంతీయ పార్టీల పరిస్థితి”పై చర్చ అత్యంత కీలకమైనది..!
* త్వరలో తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు ఉన్నాయి. దీనిలో వైసీపీ విజయనానికి ఢోకా లేదు. కాకపోతే అక్కడ మెజారిటీ కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఇద్దరి మధ్య కొద్దిపాటి చర్చకు వచ్చాయి. అభ్యర్థి ఎంపిక పూర్తయిన నేపథ్యంలో పీకే టీమ్ నుండి ఇద్దరిని ఆ ఎన్నిక కోసం వ్యూహకర్తలుగా వ్యవహరించనున్నారు. ఒక వేళా స్థానిక ఎన్నికలు జరిగితే దానికీ కలిసి పని చేయనున్నారు.
* ఇక రాష్ట్రంలో హిందూ విగ్రహాల దాడి నేపథ్యంలో ప్రభుత్వం ఇరుకున పడుతుంది. దీన్ని ఎదుర్కోవడంలో కొంత మేరకు ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను అనుకున్నట్టుగా తిప్పికొట్టలేకపోతున్నారు. దీనిపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగింది. దీంతో పాటూ అత్యంత కీలకంగా..!!
మమత పరిస్థితి పై జగన్ ప్రత్యేక వాకబు..!!
ప్రస్తుతం దేశంలో రాజకీయం మొత్తం పశ్చిమ బెంగాల్ వైపు చూస్తుంది. దేశంలో ప్రాంతీయ పార్టీల్లో అత్యంత సమర్ధమైన నాయకురాలు మమత బెనర్జీ మాత్రమే. బీజేపీకి/ మోడీకి వ్యతిరేకంగా గట్టిగా గళం ఎత్తాలంటే ఆమె మాత్రమే ముందుంటారు. నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్, లాలూ ఈ ఎవ్వరూ పెద్దగా బీజేపీతో గిల్లి కజ్జాలాటలే తప్ప గట్టిగా పోరాడి రాజకీయ రిస్క్ తీసుకోరు. దేశంలో బీజేపీ ఒక రాజకీయ శక్తిగా ఎదిగి.., ప్రాంతీయ పార్టీలను ఒక్కోదాన్ని తొక్కేస్తున్న తరుణంలో బెంగాల్ లో మమత పరిస్థితి ఏమిటా..? అని చర్చ జరుగుతుంది. ఆమె గెలిస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఒక ఆశ. లేకపోతే బీజేపీకి సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది.
* బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ గెలుపునకు పీకే ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అక్కడ ప్రస్తుత పరిస్థితులపై ఈ ఇద్దరి మధ్య చాల చర్చ జరిగింది. బెంగాల్ లో పరిస్థితులపై జగన్ మొత్తం ఆరా తీశారని సమాచారం.
కేటీఆర్ తో భేటీలోనూ..!!
ఇక కేటీఆర్ తో భేటీలోనూ ఇదే తరహా అంశాలు చర్చకు వచ్చాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి టీఆరెస్ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పీకే ని నియమించాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఆ ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. కానీ కేసీఆర్ అంగీకరించడం లేదు. “మనమే సొంత వ్యూహకర్తలం. మనకు పీకేలు ఎందుకు..?” అనేది కేసీఆర్ భావన. ఈ నేపథ్యంలో ఈ ప్యాకేజీ గురించి చర్చించేందుకు కేటీఆర్ – పీకే ల భేటీ జరిగింది అంటున్నారు. దీంతో పాటూ బెంగాల్ ఎన్నికలపై సేమ్ జగన్ కనబర్చిన ఆసక్తిని కేటీఆర్ కూడా మాట్లాడారు.
బీజేపీ భవిష్యత్తుపై అంచనా కోసమే..!!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీ ఎదుగుతుంది. తెలంగాణాలో గెలుపు రుచి చూస్తుంటే.. ఏపీలో కాస్త ఉనికి చూపగలుగుతుంది. అంటే కేసీఆర్, జగన్ లకు ఇక ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ అవతరించబోతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇక్కడ జగన్ కి కానీ.. అక్కడ కేసీఆర్ కి కానీ ముప్పు తప్పదు. కేసీఆర్ పగలు బీజేపీతో కయ్యానికి కాలు దువ్వినా రాత్రి అయితే మోడీ, అమిత్ షా లని కలిసి దువ్వక తప్పదు..!! అందుకే బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది..? దేశంలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది..? మేము బీజేపీతో ఎలా వ్యవహరించాలి..? అనే కోణంలో ఈ భేటీలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం..!!