Lock Down : దేశ రాజధాని ఢిల్లీ మరోమారు దద్దరిల్లేలా కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కల్లోలం కొనసాగడం, కరోనా కట్టడికి లాక్ డౌన్ ను మరోమారు పొడగించిన తరుణంలో ఇంకో వార్త వైరల్ అవుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా ఉద్యమిస్తున్న రైతులు మరో పిలుపు ఇచ్చారు. ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని ఉద్యమాలు చేస్తున్న రైతు సంఘాలు డిసైడ్ చేశాయి.
ఇది రైతు సంఘాల ఆలోచన…
నూతన చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రైతులు చేసిన ఈ ఆందోళనతో కేసులు పెరిగాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే, ఎన్నికల పేరుతో సభలు- సమావేశాలు నిర్వహించినందు వల్లే కరోనా కేసులు పెరిగాయని పేర్కొన్న రైతు నాయకులు అదే సమయంలో కరోనా మహమ్మారి విస్తృతం అవడంతో ఢిల్లీని వదిలి తమ స్వస్థలాలకు వెళ్లారు. తాజాగా మరో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో సామూహిక భోజన కార్యక్రమాలు వారం రోజులపాటు చేపట్టాలని రైతులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
బ్లాక్ డే కూడా…
ఆందోళనలతో పాటుగా ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని కూడా రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా తీసుకున్న ఈ నిర్ణయంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు ప్రయాణం అవుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలు చేసే ప్రాంతంలో ప్రజల్లో కలవరం మొదలయింది. ఇదిలాఉండగా, కరోనా విస్తృతి ఢిల్లీలో తగ్గినప్పటికీ ముందుజాగ్రత్తగా ఈనెల 31వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?